తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని భూముల సేకరణ లో పాల్పడిన అవకతవకలను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు విధించిన స్టే ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ సుభాష్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేస్తూ కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత దవే హాజరయ్యారు.
రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అసాధారణమైనవి ఆయన పేర్కొన్నారు. జరిగిన అవకతవకలపై విచారణ చేయకుండానే అడ్డుకోవడం అదీ కూడా తెలుగుదేశం పార్టీ కి చెందిన ఒక అనునాస్పద వ్యవస్థ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం తీవ్రమైనదని ఆయన అన్నారు.
ఈ విధంగా విచారణను హైకోర్టు అడ్డుకోజాలదని ఆయన అన్నారు. హైకోర్టు ఈ విధమైన అసాధారణ అధికారాలను వాడుకోలేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని న్యాయవాది దవే అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా హైకోర్టు న్యాయమూర్తులు వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
కేవలం పిటిషన దాఖలు చేసిన వారికి రిలీఫ్ ఇవ్వడం కాకుండా కేసులో ఉన్న నిందితులందరికి వర్తించే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా అసంబంద్దంగా ఉందని న్యాయవాది దవే అన్నారు.
సెప్టెంబర్ 15 ఉదయం 9 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసిందని అయితే విచిత్రంగా 14 తేదీ సాయంత్రమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ విధంగా ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయడానికి ముందే విచారణ ను అడ్డుకోవడం గమనార్హమని దవే వాదించారు.